ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యుల వారి కార్యాలయం

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

IMG 20240823 WA0131

సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు, యాంత్రిక జీవనానికి పరిష్కారం చూపించేవి ఇలాంటి కల్చరల్ సెంటర్సేనని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ రోజు రోడ్ నెంబర్ -10, జూబ్లీహిల్స్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లోనే ఇంతటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగాక ఆత్మహత్యల శాతం పెరుగుతుందని.. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న రంగనాథ్ గారి ఆత్మహత్య ఇందుకు ప్రధాన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఆయనకు జీవితాంతం బ్రతకడానికి సరిపడేంత డబ్బుంది.. ఆస్తులున్నాయి.. పిల్లలు విదేశాల్లో ఉన్నారు.. ఆయన బాగోగులు చూసుకునేవారు ఒక్కరు దగ్గర లేక ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్నారని ఇది అత్యంత బాధకలిగించిందని ఆయన అన్నారు. ఒంటరితనం వల్ల ఇబ్బందులుపడుతున్న పెద్ద వయసువారికి ఇలాంటి కల్చరల్ సెంటర్స్ ఒక మార్గం చూపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కల్చరల్ సెంటర్ చూసాక చాలా సంతోషం కలిగింది. ఇక్కడ ఉన్న వాతావరణం, వసతులు చాలాబాగున్నాయి. ఇవన్నీ చూసాక నాకు కూడా సభ్యత్వం తీసుకోవాలనే అనిపించింది. ఈ కల్చరల్ సెంటర్ కు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎదైనా మౌళిక సదుపాయల కల్పన అవసరం ఉంటే నాకు చెబితే.. జీహెచ్ఎమ్సీ అధికారులతో మాట్లాడి అవసరమున్న మేరకు వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఆత్మీయ కథానాయకుడు, పద్మవిభూషణ్ చిరంజీవిగారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. వారు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి.. మనందరిని రంజింపచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, పద్మవిభూషణ్ చిరంజీవి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now