ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి శుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమంగా “ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్ర”ను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా బస్టాండ్ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని వ్యాపారులకు సూచిస్తూ, ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం నిలిపిన వ్యాపారులను సన్మానించారు.
తరువాత ఎమ్మెల్యే డీఎంను సంప్రదించి, బస్టాండ్ పరిసరాల శుభ్రత, శానిటేషన్ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే బస్టాండ్లోని మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా నిర్వహించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ప్రయాణికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, “ఎల్లారెడ్డిని శుభ్రత పరంగా రాష్ట్రంలోనే కాక దేశంలోనూ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరం” అని పేర్కొన్నారు.
తదుపరి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైవే నిర్మాణం కారణంగా తొలగించాల్సి వస్తున్న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సందర్శించి, ఆ విగ్రహాన్ని తగిన ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. విగ్రహ పరిసరాల్లో రూ.15 లక్షల మున్సిపల్ నిధులతో బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని, అవసరమైతే తన వ్యక్తిగత నిధులతో పునఃప్రతిష్ఠ పనులు పూర్తి చేస్తానని తెలిపారు.
“ఎల్లారెడ్డి మున్సిపాలిటీని దేశంలోనే అత్యంత శుభ్రత కలిగిన పట్టణంగా, ఇండోర్ నగరాన్ని మించి నంబర్ వన్ స్థానంలో నిలపడం నా సంకల్పం” అని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.