ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట (ఆర్సీ)
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించి, ఇటీవల పలు గ్రామపంచాయతీలలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలు కె గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సన్న రకం ధాన్యం కి 500 రూపాయలు బోనస్ ,సుపక్కాగా అమలు అవుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒకవేళ తన దృష్టికి రాని సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పరిష్కారం అయ్యే పనులను పెండింగ్లో ఉంచకూడదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ప్రధాన బాధ్యత అని, అందుకోసమే విశ్రాంతి లేకుండా ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నానని అన్నారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా విని, వాటిని లోతుగా అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే జారె
