Site icon PRASHNA AYUDHAM

నర్సాపూర్ పట్టణంలో కోతుల స్వైర విహారం

IMG 20250819 233308

Oplus_131072

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో కోతుల సంచారం రోజురోజుకి పెరుగుతోంది. మంగళవారం ఉదయం స్థానిక విజేత స్కూల్ ఆవరణలో కోతుల గుంపులు గుంపులుగా తిరుగుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో భయం కలిగించాయి. పట్టణానికి చెందిన అనేక మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో వానరాల హడావుడి ఆందోళనకు గురి చేసింది. కేవలం ఈ పాఠశాల పరిసరాల్లోనే కాకుండా, పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలలోనూ కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు స్కూల్‌కి వెళ్ళే, వచ్చే సమయంలో దాడి చేసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల కోతులు పండ్ల దుకాణాలు, ఇళ్లపైకి ఎగబాకి ఆస్తి నష్టం కలిగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వానర మూకల నియంత్రణకు శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి పట్టణ ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కదిలి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version