మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నవనీత్ రాణా పోటీ చేయరని ఆమె భర్త రవిరాణా వెల్లడించారు. ఆమెకు రాజ్యసభ సీటును కేటాయిస్తామని భాజపా హామీ ఇచ్చిందని చెప్పారు. బడ్నేరా నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న రవిరాణా మీడియాతో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘‘నవనీత్ రాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని భావిస్తున్నా. ఆమె రాజ్యసభకు వెళ్తుందని మహారాష్ట్ర భాజపా చీఫ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఇతర సీనియర్ నేతలు పలుమార్లు చెప్పారు. అది ఆమెకు సరైందని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నవనీత్ విజయం సాధించారు. అప్పుడు ఆ గెలుపు వెనుక ఎన్సీపీ, కాంగ్రెస్ సహకారం ఉంది. అయితే 2024లో ఆమె భాజపాలో చేరారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ ఆమెకు టికెట్ కేటాయించింది. కానీ కాంగ్రెస్ నేత బల్వంత్ వాంఖడే చేతిలో ఓటమి పాలయ్యారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రవిరాణా నుంచి ఈ స్పందన వచ్చింది. ఆయన బడ్నేరా నుంచి 2009 నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు.