Headlines :
-
సుందరయ్య స్ఫూర్తితో కొత్త రాజకీయ వ్యవస్థ – సిపిఎం నేత వి.శ్రీనివాసరావు పిలుపు
-
అసమానతలు లేని సమాజం కోసం సుందరయ్య స్ఫూర్తిని అనుసరించాలి – సిపిఎం ప్రకటన
-
శ్రీకాకుళంలో సుందరయ్య విగ్రహావిష్కరణ, సమాజ మార్పు కోసం సిపిఎం పిలుపు
సిపిఎం వి.శ్రీనివాసరావు
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట సారథి పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్త్తితో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలోగల స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో ఏర్పాటు చేసిన సుందరయ్య విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలపై యువతకు జుగుప్స కలిగిస్తున్న తరుణంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని పునరుద్ధరించి అసమానతలు, అవినీతికి తావులేని సమాజం కోసం అంతా పాటుపడాలని పిలుపునిచ్చారు.
జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో సుందరయ్య చదువును సైతం విడిచిపెట్టి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యమయ్యారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం రావాలని ఎంతగా కోరుకున్నారో అసమానతలు లేని సమాజం కోసం అంతగా పాటుపడ్డారని వివరించారు. సమ సమాజం కోసం సోషలిజం తప్ప, మరో ప్రత్యామ్నాయం లేదని భావించిన సుందరయ్య తన యావజ్జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ కాలంలో శ్రీకాకుళం జిల్లా ఎందరో త్యాగధనులను అందించిందన్నారు. భావితరాలను ప్రభావితం చేసేలా స్మృతివనంలో స్వాతంత్య్ర సమరయోధుల, సంఘ సంస్కర్తల విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఆచరణ, ఆశయం ద్వారా ప్రజలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. సుందరయ్యను కీర్తిస్తూ అవధాన పండితులు పైడి హరనాథరావు గానం చేశారు. విగ్రహదాత, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు విజికె.మూర్తి, శిల్పి దివిలి హేమచంద్రలను శ్రీనివాసరావు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం, ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు, గాంధీ మందిరం ప్రతినిధులు జామి భీమశంకరరావు, నటుకుల మోహన్, ఎం.ప్రసాదరావు, కొంక్యాన వేణుగోపాల్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.