తమ డిమాండ్ల సాధన కోసం రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఒక ఆశా వర్కర్ గాయపడగా, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో, ఆశా వర్కర్లు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో ఆశా వర్కర్ రాజేశ్వరి కిందపడి కాలికి గాయాలయ్యాయి. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం, దురుసుగా ప్రవర్తించడం వల్లే తమ సహచరురాలు గాయపడిందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇంతలో, సీఐ స్థాయి పోలీస్ అధికారి సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్పై అసభ్యంగా మాట్లాడటమే ఈ ఉద్రిక్తతకు కారణమని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అనంతరం చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు.
చివరకు చంద్రశేఖర్ను అక్కడికి తీసుకువచ్చిన తర్వాతే పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఈ ఆందోళనలో సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.











