తెలంగాణ భవన్లో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు.
మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై ప్రశ్నలు లేవనెత్తారు. 'ఎవరి ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని 'ఐసీయూలో ఉన్న పార్టీ'గా అభివర్ణించిన శ్రీనివాస్, తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ వారిని నట్టేట ముంచారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని విద్యార్థులను, నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేస్తున్నారని, చాయ్ పై చర్చ పేరుతో వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రజలను నమ్మించలేకపోయారని, హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి, చేవెళ్ల డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లన్నీ 'డెత్ డిక్లరేషన్లు'గా మారాయని, 'భరోసా' పేరుతో ప్రజలకు భరోసా లేకుండా చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అని, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, స్కూటీల పంపిణీ వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని శ్రీనివాస్ విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణపై ప్రేమ ఉందా, లేక అక్రమ సొమ్ముపై ప్రేమ ఉందా అని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

