హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినప్పటికీ, పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్యతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మృతుడు సాయిని కుమార్ (40) మరణంపై అతని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదులో, తన కుమారుడికి రూ.60,000 అప్పు ఇచ్చిన రామ్ మల్లేష్పై అనుమానం వ్యక్తం చేశారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, మృతుడి భార్య సాయిని భారతి (36)కి గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ (45)తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన మృతుడు, మద్యం సేవించి భార్యను హింసించేవాడని తెలిసింది. అప్పులు తీర్చలేక మృతుడు రామ్ మల్లేష్ (40) వద్ద రూ.60,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో మల్లేష్ పలుమార్లు గొడవ పడి, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది.
మృతుడి భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్ కలిసి, మృతుడిని హత్య చేస్తే తమ అక్రమ సంబంధానికి అడ్డంకి తొలగిపోతుందని పథకం రచించారు. మృతుడి పేరిట ఉన్న జీవిత బీమా పాలసీల ద్వారా రూ.10,00,000కు రామ్ మల్లేష్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.2,00,000 ముందస్తుగా చెల్లించారు. మల్లేష్, శ్రీరామ్ కుమార్ (నివాసం: మంచిర్యాల) సహాయంతో హత్యకు ప్రణాళిక రచించారు.
పథకం ప్రకారం, 2026 ఏప్రిల్ 22వ తేదీ రాత్రి ముల్కల్ల గ్రామ శివారులో మృతుడికి అధిక మోతాదులో మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం, ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని, మోటార్ సైకిల్ను రోడ్డుపై పడవేసి పరారయ్యారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులలో మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లు, నగదు, ఇనుప సుత్తి, మద్యం సీసాలు, గ్లాసులు ఉన్నాయి. మృతుడి భార్య వద్ద పలు బీమా పాలసీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ పర్యవేక్షణలో, పరిశోధనాధికారి జి. రవీందర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హాజీపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సదానందం, కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, గంగాధర్ తదితర సిబ్బంది వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానం, నిఘా ఆధారంగా హత్య కేసును ఛేదించారు. ఈ సిబ్బందిని అభినందించారు.











