కామారెడ్డి జిల్లా కేంద్రంలో పానీ పూరిలో పల్లేరుగాయ దొరకడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ఆహార భద్రతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సరైన తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కామారెడ్డి బస్టాండ్ సమీపంలోని ఓ స్వీట్ హౌస్ వద్ద శనివారం ఈ సంఘటన జరిగింది. సుదర్శన్ అనే వ్యక్తి పానీ పూరి తింటుండగా, అతని పళ్లకు పల్లేరుగాయ తగిలింది. బండి నిర్వాహకుడు దానిని మసాలా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
పల్లేరుగాయ వంటి హానికరమైన పదార్థాలు ఆహారంలో కలపడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా, వాటి వివరాలు బహిర్గతం చేయడం లేదని ఆరోపణలున్నాయి.
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎల్లప్పుడూ టూర్లలోనే ఉంటున్నారని, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే స్పందించి, ఆహార భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

