*మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి*
*యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మానవ హారం లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల ఐపిఎస్*
యువత ముఖ్యంగా, విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు.
యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీ లో నిర్వహించిన యాంటి డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపిఎస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై 300 మంది విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. విద్యార్థులతో *SAY NO TO DRUGS* అనే నినాదాలు చేయించారు.
అనంతరం జిల్లా ఎస్పీ గారు క్యాంపస్ ఆవరణలో కాసేపు పర్యటించి విద్యార్థుల బాగోగులు తెలుసు కొని,విద్యార్థులతో కలిసి భోజనం చేసారు.అనంతరం క్యాంపస్ ఆవరణలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, వైస్ ఛాన్సులర్ గోవర్ధన్, మిగతా ప్రొఫెసర్స్ మరియు విద్యార్థులతో కలిసి మొక్కల్ని నాటారు.
ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎస్పీ గారు మాట్లాడుతూ, “విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది .ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది.ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి” అని హితవు పలికారు.
నిర్మల్ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ గారు తెలిపారు. ప్రజల చైతన్యం, విద్యార్థుల సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఎస్పీ గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి తో పాటు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, వైస్ ఛాన్సులర్ గోవర్ధన్,ముధోల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, డిఎస్బి ఇన్స్పెక్టర్ సమ్మయ్య, బాసర ఎస్ఐ శ్రీనివాస్, ముధోల్ ఎస్ఐ పెర్సిస్,ఇతర పోలీసు సిబ్బంది, కాలేజీ ప్రొఫెసర్ లు డా విఠల్, నాగరాజు రాకేష్ రెడ్డి,విజయ్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.