🔹 నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి
రాష్ట్రాన్ని కుదిపేసిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం.
నిందితుడు రియాజ్ పోలీసులు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మృతి.
ఆదివారం సారంగాపూర్ దగ్గర రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హాస్పిటల్లో కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఘటన.
ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించి వివరాలు వెల్లడించారు.
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20 నిజామాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ఆదివారం సారంగాపూర్ సమీపంలో పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ రియాజ్ అకస్మాత్తుగా కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో ప్రమాదం జరుగకుండా అడ్డుకోవడానికి పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో కుప్పకూలిన రియాజ్ను వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు అధికారి డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ, “ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలోనే పోలీసులు చర్య తీసుకున్నారు. రియాజ్ కాల్పులు జరిపి ఉంటే మరికొంతమంది ప్రాణాలు కోల్పోయేవారు” అని స్పష్టం చేశారు.
రియాజ్ మృతి వార్తతో నిజామాబాద్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు దళాలు అప్రమత్తంగా మోహరించాయి.