ఓకే రోజు రెండు ఇళ్లలో భారీ చోరీ
తిమ్మాపూర్ లో వెలుగు చూసిన ఘటన
ప్రశ్న ఆయుధం మే 10 ( బాన్సువాడ ప్రతినిధి )
బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజున రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని అల్వాల చంద్రయ్య కుటుంబం మొత్తం ఏడుపాయలకు వెళ్లిన సమయంలో దొంగలు వారి ఇంట్లో చొరబడి దాదాపు మూడున్నర తులాల బంగారం, 24 తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రయ్య కుటుంబ సభ్యులు ఏడుపాయల నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగలు దోచుకెళ్లారని చంద్రయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజున తిమ్మాపూర్ గ్రామంలోనే మరో దొంగతనం ఘటన వెలుగు చూసింది. ధన్సింగ్ అనే వ్యక్తి హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దొంగలు ఆరున్నర తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదును కూడా దోచుకెళ్లారని ధన్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ను ఇంకా పెంచాలని,సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.