*ఆన్ లైన్ మోసాలు పెరిగాయి… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత*
విజయవాడలో ‘సురక్షా 360’ కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత
సీసీ కెమెరాల ఏర్పాటుతో రాష్ట్రంలో నేరాలు తగ్గాయన్న మంత్రి
టెక్నాలజీ వాడకంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందుందని ప్రశంస
ప్రతి గ్రామం, వీధి నిఘా నీడలోకి తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి
ఆలయాలు, చర్చిలు, మసీదుల కోసం 28 సురక్షా డివైస్ కిట్ల పంపిణీ
ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
“గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. క్షణికావేశంలో వాటిని క్లిక్ చేస్తే మీ కష్టార్జితం మొత్తం సైబర్ నేరగాళ్ల పాలవుతుంది” అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, సాంకేతికతను మంచి కోసం ఎంతగా వాడుతున్నామో, చెడుకు కూడా అంతేస్థాయిలో వినియోగిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం జరిగిన ‘సురక్షా 360’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.