ఆ ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఆపరేషన్‌ సిందూర్‌.!!

* ఆ ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఆపరేషన్‌ సిందూర్‌.!!*

*ప్రధాని సూచించిన పేరుతో సైనిక చర్య!*

*న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7*

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌” అనే పేరును ప్రధాని నరేంద్ర మోదీ పెట్టారు.

ఈ పేరు ఎంపిక వెనుక చాలా అర్థం ఉంది. అదేంటంటే… పహల్గాంలో పర్యాటకులను తుపాకులతో చుట్టిముట్టిన ఉగ్రమూక… పురుషులనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. పేర్లు, మతం అడగటంతోపాటు కలిమా చదివించి మరీ ప్రాణాలు తీసింది. పిల్లల కళ్ల ముందే తండ్రిని, భార్య చూస్తుండగానే భర్తను చంపి మారణహోమం సృష్టించింది. ఓ నవ వధువు సహా చాలామంది ఆడబిడ్డలను వితంతవులను చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహిత మహిళలు తమ నుదుటి మీద పెట్టుకునే బొట్టు(సిందూరం)ను ఎంతో పవిత్రంగా, వివాహానికి గుర్తుగా భావిస్తుంటారు. అంతటి విలువైన బొట్టును కోల్పోయిన మహిళల కన్నీటికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నామనే ఉద్దేశంతోనే సైనిక చర్యకు ”ఆపరేషన్‌ సిందూర్‌” అనే పేరు పెట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రకటన చేస్తూ భారత ఆర్మీ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలో కూడా ఈ ఉద్దేశం స్పష్టమవుతోంది. ఆ చిత్రంలో సిందూర్‌ అనే పదం ఆంగ్లంలో రాసి ఉండగా.. అందులోని రెండు ‘ఓ’ల్లో ఒకదాని స్థానంలో సిందూరంతో నిండిన ఓ గిన్నెను ఉంచారు. ఆ గిన్నె నుంచి కొంత సిందూరం చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు డిజైన్‌ చేశారు. మహిళలు తమ సిందూరాన్ని కోల్పోయారనే అర్థం వచ్చేలా అది ఉంది. ఇక, ఆ ఫొటోకు ” జస్టిస్‌ సర్వ్‌డ్‌.. జైహింద్‌” అనే శీర్షిక ఇవ్వడంతో ఆ పేరు వెనుక ఉద్దేశం మరింత స్పష్టమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment