*పాక్ ప్రధాని పరార్..!*
*వణికిపోతున్న పాకిస్తాన్.. అజ్ఞాతంలో ప్రధాని..*
*పాక్ ప్రధాని ఇంటి సమీపంలోని దాడులు*
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మెరుపుదాడులతో పాకిస్తాన్ గజగజా వణుకుతోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావాలను నేలకూల్చిన తర్వాత భారత్పై పాక్ తన అక్కసును వెల్లగక్కుతోంది. బుధ, గురు వారాల్లో భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులకు దిగింది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్కు సంబంధించిన 8 డ్రోన్లు, మూడు ఎఫ్ జెట్లను కూడా కూల్చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ పైలెట్ను కూడా బందీగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ ..భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగింది. జమ్ము, పఠాన్కోట్, ఉధంపూర్లో పాక్ దాడులు చేసింది. అయితే పాక్ మిసైల్స్, డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాలను భారత సైన్యం గాల్లోనే కూల్చేసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, కరాచీపై మిస్సైల్స్తో దాడికి దిగింది. దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇస్లామాబాద్లోని తన ఇంటిని ఖాళీ చేసి, బంకర్లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాల్లో పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించారు. అయితే పాక్ చొరబాటు యత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది. అలాగే పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో అలర్ట్ చేశారు. అలాగే ఢిల్లీ, హర్యానా, బెంగాల్, హిమాచల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, పాలనాధికారుల సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు చేశారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు.