*కంకర టిప్పర్ల రాకపోకలతో రోడ్డు అధ్వానం.*
*ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు*
*పట్టించుకోని అధికారులు*
సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు–ఇంద్రేశం రహదారి గుంతలతో నిండిపోగా, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ వేలాది వాహనాలు ఈ రోడ్డుపై నడుస్తున్నా, గుంతలను పూడ్చి వేయకుండా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు గుంతలతో పాడైపోయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. భారీ టిప్పర్లు నిరంతరం తిరగడంతో రోడ్డు మరింత నాశనమవుతోందని, గుంతలు మరింత ప్రమాదకరంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి గుంతల్లో పడిపోతున్నారు. ఆటోలు, కార్లు గుంతల్లో చిక్కుకుని దారుణంగా దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రేశం నుంచి పటాన్ చెరు వరకు మూడు కిలో మీటర్ల పొడవునా రహదారి పూర్తిగా కుదేలైంది. రోజూ అధికారులు ఈ రోడ్డుపై వెళ్లినా, సమస్యను చూడకపోవడం యావత్ ప్రజలకు షాక్కు గురి చేస్తోంది. వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ గుంతల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయే వరకు అధికారులు చూడరా..?’’ అంటూ మండి పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మేల్కొని రహదారి మరమ్మతులు చేపట్టాలని, లేనిచో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు పేర్కొన్నారు.