పవన్ను అవమానించేందుకేనా..
ఆర్భాటం జాస్తి.. నిధులు నాస్తి..
డబ్బు మంజూరు చేయని చంద్రబాబు సర్కార్..
నిధులు జీఓకు స్వాతంత్య్రం రాలేదా? అంటూ సర్పంచుల ఎద్దేవా..
జనరల్ ఫండ్ నుంచి వాడుకోవాలని అధికారుల ఉచిత సలహా..
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ స్వాత్రంత్య దినోత్సవాన్ని అన్ని పంచాయతీల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, అలాగే 5 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేల చొప్పున విడుదల చేస్తూ జీఓ జారీ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో సర్పంచ్లు సంబర పడ్డారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏ ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. కానీ పవన్ ప్రకటన చూసిన వారంతా ఆ నిధులు సర్పంచ్లు, టీచర్లు కలిసి పంచుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీనిపై ఏ సర్పంచ్ను కదిపినా నిధుల జీఓకు ఇంకా స్వాతంత్య్రం రాలేదేమో..అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొన్ని చోట్ల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పవన్ కల్యాణ్ మాటలు నమ్మి అప్పులు చేసి మరీ వేడుకలు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం జీఓనే ఇవ్వలేదని తెలిసి తలలుపట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను అవమానించేందుకు టీడీపీలోని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే పవన్ ఏం చెప్పినా…ఆ పని కాకుండా మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. అందుకే పవన్ మాటలకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వెళ్లినప్పుడు గానీ, ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయినప్పుడు గానీ పవన్ కల్యాణ్ను పిలవక పోవడం పలు అనుమానాలకు దారితీస్తోందంటున్నారు. ఇక స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని పవన్ కల్యాణ్ మీడియా ముందు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం చూస్తే తమ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోందని జనసేన నేతలు సందేహం వెలిబుచ్చారు.పంచాయతీల్లో సర్పంచ్లు సగౌరవంగా జెండా వందనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణ కోసం చిన్న పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు చొప్పున నిధులు ఇస్తున్నాం. ఇందుకు జీఓ కూడా విడుదల చేశాం. సర్పంచ్లు ఆ డబ్బుతో వేడుకలు ఘనంగా నిర్వహించాలి. పాఠశాలల్లో డిబేట్లు, క్విజ్లు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ రంగంలో పని చేసిన వారు, పారిశుధ్య కార్మికులను సన్మానించాలి. అలాగే పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టాలి”- ఈ నెల 10న ఉప ముఖ్యమంత్రి హోదాలో మీడియా ముందు పవన్ కల్యాణ్ చెప్పిన మాటలివిడిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ జీఓ జారీ చేశామని చెప్పారు. అయితే రూపాయి కూడా విడుదల కాలేదు. జనరల్ ఫండ్లో నిధులుంటే వాడుకోవాలని ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇచ్చారు. కానీ సర్పంచ్లు మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు