*భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందం..*
*సరిహద్దుల్లో శాంతి శంఖారావం*
శనివారం సాయంత్రం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత సైన్యం సమాధానం కారణంగా పాకిస్తాన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. చివరకు అమెరికాను రాయబారం కోసం వేడుకోగా, ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత అధికారికి ఫోన్ చేశారు.
భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 17.00 గంటల నుంచి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని ఈరోజు రెండు పార్టీలకు ఆదేశాలు అందాయన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ చర్చించనున్నట్లు వెల్లడించారు.
దృఢంగా ఉన్న భారత్
కాల్పుల విరమణను ధృవీకరిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, అచంచలమైన వైఖరిని ఇలాగే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.