భూభారతి పెండింగ్ దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించండి — కలెక్టర్ ఆదేశాలు
రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం – ప్రజలకు న్యాయం చేయడం అధికారులు బాధ్యతగా తీసుకోవాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 14
జిల్లాలో భూభారతి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజులలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహమ్మద్నగర్, బిచ్కుంద, గాంధారి, లింగంపేట మండలాల తహసిల్దార్లతో భూభారతి దరఖాస్తుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఇప్పుడు వాటిని సమయానికి పరిశీలించి పరిష్కరించడం అధికారుల బాధ్యత” అని తెలిపారు.
తహసిల్దార్లు వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మీ మండలాల్లో ఉన్న భూభారతి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
భూభారతి దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.