రైల్ రైకోలకు కవిత పిలుపు!
రాస్తారోకో అంటే పర్వాలేదు కానీ.. మరీ రైల్ రోకోలు అంటే చిన్న విషయం కాదు. రైళ్లకు అడ్డం పడితే పెద్ద కేసులు పెడతారు. ఆ కేసుల్నించి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలోనూ కేసులు పెట్టకుండా వదిలి పెట్టలేదు. ఆ కేసుల్లో ఇటీవల వరకూ కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కోవాల్సింది. అయితే ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు కవిత ఏకంగా రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. బీసీ సంఘాలన్ని.. బీసీలంతా జూలై పదిహేడో తేదీన రైల్ రోకో చేయాలని పిలుపునిచ్చారు.
బీసీ ఎజెండాతో రాజకీయాలు చేయాలనుకుంటున్న కవిత బీసీ సంఘాలను ముందుకు తెస్తున్నారు. అమెరికా నుంచి తాను వచ్చిన సమయంలో బీసీ సంఘాల పేరుతోనే ఆహ్వానాలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధదమవుతున్న సమయంలో మెదక్ లో బీసీ సంఘాలతో సమావేశం అయి ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పనిలో పనిగా రిజర్వేషన్లు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికలు జరగనివ్వబోమని కూడా సవాల్ చేశారు.
కవిత పిలుపు బీఆర్ఎస్కు కూడా షాక్ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ అదే రాజకీయం అనుకుంటున్నారు. కానీ కవిత మాత్రం ప్రజల్లోకి వెళ్లేందుకు.. ప్రజలతో ఉద్యమాలు చేయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో జాగృతి తరపున కార్యక్రమాలు చేపట్టినా బీఆర్ఎస్ నేతలు కొంత మంది పాల్గొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పూర్తిగా జాగృతి క్యాడర్ తోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటివి కవితకు.. బీఆర్ఎస్కకు మరింత దూరం పెంచాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.