పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం –
కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు రాజకీయంగానూ పెను సంచలనం అవుతున్నాయి. ఈ దాడుల వెనకు బీజేపీ దీర్ఖకాలిక వ్యూహం ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ తర్వాత ఎక్కువ పనులు ఆయనే చక్క బెడుతున్నారు. అలాంటి కీలక పొజిషన్లో ఉన్న ఆయనపై ఈడీ ఒక్క సారిగా ఎటాక్ చేసింది. ఆయన ఆర్థిక మూలాల నుంచి పరిశోధించి అక్రమాలను వెలికి తీసేందుకు భారీ కసరత్తు చేసి మరీ బరిలోకి దిగింది. ఏం కనిపెట్టారన్నది బయటకు తెలియడానికి సమయం పడుతుంది. ఈ దాడుల వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయి ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రాజకీయం మాత్రం ఉందని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలతో పాటు ఇతరులు కూడా నమ్ముతున్నారు.
కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయబోతున్నారా ?
కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రిస్క్లో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదయింది. గవర్నర్ అనుమతితోనే ఇదంతా జరిగింది. ఇక్కడ ఇంకా అక్కడి వరకూ రాలేదు కానీ పొంగులేటిపై ఐటీ దాడులు ఆ కసరత్తుకు ప్రారంభం అని అనుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి ఆర్థిక బంధాలు ఎంతో విస్తృతంగా ఉంటాయి. ఆయన వ్యాపారం రాజకీయంతో కలిసిపోయి ఉంటుంది. అంత స్వచ్చంగా వ్యాపారాలు నిర్వహించలేరు. ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. బీజేపీకి ఆయనను తన దారిలోకి తెచ్చుకోవడానికి అది సరిపోతుంది. నిజంగా అలాంటి వ్యూహం ఉంటే మాత్రం పొంగులేటికి కూడా మరో దారి ఉండదు.