డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా
– మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 17, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని రామేశ్వరం పల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలు వీధిదీపాలు, డ్రైనేజ్ క్లీనింగ్, నీటి సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తానని అన్నారు. పట్టణంలో వార్డుల వారిగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్ క్లినిక్ గురించి చైర్ పర్సన్ వివరించారు. వీలైనంత తొందరలో కలెక్టర్ తో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు డబుల్ బెడ్ రూమ్ లలోని సమస్యలను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, ఆర్.ఐ పూల్ సింగ్, మున్సిపల్ అధికారులు, జవాన్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.