అమరావతిలో ఐటీకి కొత్త జోష్.. 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం
50 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ప్రాజెక్టులో భాగస్వామిగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం
ఉచితంగా క్వాంటమ్ కంప్యూటర్ అందించనున్న సంస్థ
ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగేళ్లపాటు ఉచిత ఇంటర్నెట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం భాగస్వామ్యంతో ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది.
ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్’ (ఏక్యూసీసీ) ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఐబీఎం కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యమున్న సిస్టమ్తో పాటు, 5కే గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు ఐబీఎం అంగీకారం తెలిపింది. దీని ప్రకారం, చదరపు అడుగుకు రూ. 30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నాలుగేళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు.