*శత్రువు బలహీనంగా ఉన్నా*
*ఎందుకు వదిలేసినట్టు..*
*విరమణ ఒప్పందంపై ప్రశ్నలెన్నో!*
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ రెండు దేశాలతో మేం సుదీర్ఘ చర్చలు జరిపాం. కాల్పులు విరమించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా కండ్లు నులుముకొని చూశారు. ఇది కలా.. నిజమా? అని ఆశ్చర్యపోయారు. భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్రేకింగ్! బీజేపీకి పెద్ద మద్దతుదారుగా ఉన్న ఓ జాతీయ చానల్ యాంకర్ అయితే.. అదెట్లా సాధ్యమని హూంకరించారు. కాల్పుల విరమణ ప్రకటించడానికి ట్రంప్ ఎవరంటూ తనదైన శైలిలో గొంతు చించుకొని అరిచారు.
ఇదంతా అబద్ధమైతే బాగుండు’ అని వాళ్లలో చాలా మంది తప్పక అనుకొని ఉంటారు. ఇక సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారుల పరిస్థితి చెప్పడం వీలుకాదు. కొందరైతే.. పాకిస్థాన్ ప్రధాని వచ్చి మోదీ కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నట్టు ఏఐతో ఫొటోలు సృష్టించి, పాక్ లొంగిపోయిందని ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి ఫలించవని కొద్ది నిమిష్లాలోనే వారికి అర్థమైంది. ఎందుకంటే.. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు? అనే విషయం ఎవరికీ అంతుబట్టని మిస్టరీగా మారింది. ‘అసలు ఎందుకు మొదలు పెట్టినట్టు? ఏం సాధించినట్టు? ఎందుకు ఆపినట్టు? ఇది దేశం పరువుకు భంగకరం కాదా?’ అని అనేకమంది అనలిస్టులు సోషల్ మీడియాలో నిలదీయడం మొదలు పెట్టారు. మరికొంతమంది లాల్బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత సైనికులు 1965లో లాహోర్ వరకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ 1971లో 13 రోజుల్లోనే పాక్తో యుద్ధాన్ని ముగించి బంగ్లాదేశ్ను వేరుచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. మరికొంత మంది తూటా పేల్చకుండా, కేవలం సరిహద్దుల్లో సైన్యాన్ని నెలల తరబడి మోహరించడం ద్వారానే పాకిస్థాన్ను లొంగదీసుకున్న వాజపేయిని గుర్తు చేసుకున్నారు.