**ఇష్టపడి చదవాలి… లక్ష్యాలతో ముందుకు సాగాలి – విద్యార్థులకు అదనపు కలెక్టర్ రాధికా గుప్తా సందేశం**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 26
మండలం, మేడ్చల్ జిల్లా
విద్యార్థులు తమ విద్యా ప్రయాణం తొలి దశలోనే లక్ష్యాలను ఎంచుకుని, ఆ లక్ష్యాల సాధన కోసం కష్టపడకుండా ఇష్టపడి చదవాలని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా సూచించారు.గురువారం ఆమె షామీర్పేట్ మండలంలో పర్యటించి, తూముకుంట, దేవరయాంజల్ గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతులను పరిశీలించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
**విద్యా రంగంపై సమీక్ష:**
ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్ల పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలు, తరగతుల నాణ్యత వంటి అంశాలను ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలపై విద్యార్థులను ప్రశ్నించి వారి సమాధానాలు తెలుసుకున్నారు. లెక్కలు తానే చేసుకుని విద్యార్థులకు క్లాస్లో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
**అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి:**
అదనంగా, తూముకుంట గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన రాధికా గుప్తా, అక్కడి చిన్నారుల సంఖ్య, హాజరు వివరాలు, పౌష్టికాహారం సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. గర్భిణీలకు గుడ్లు, పాలు, పౌష్టికాహారం అందించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
**మరమ్మతులు, వసతులపై ఆదేశాలు:**
అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు పంపించాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో అదనపు గదులు ఉన్నట్లయితే, అవి అంగన్వాడీ కేంద్రాలుగా ఉపయోగించుకునేలా విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు.
**నశ ముక్తి భారత్ ర్యాలీ:**
ఆ తర్వాత ఆమె నశ ముక్తి భారత్ ర్యాలీలో పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.
**ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:**
తూముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, డీఈఓ విజయకుమారి, మున్సిపాలిటీ డీఈ సునీత, మేడ్చల్ సీడీపీఓ శారద, ఇతర అధికారులు పాల్గొన్నారు.