Site icon PRASHNA AYUDHAM

పాక్ సైన్యంలో కీలక అధికారి తండ్రికి ఉగ్రవాదులతో సంబంధాలు!

IMG 20250511 WA0989

పాక్ సైన్యంలో కీలక అధికారి తండ్రికి ఉగ్రవాదులతో సంబంధాలు!

ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రిపై తీవ్ర ఆరోపణలు

చౌదరి తండ్రి, అణు శాస్త్రవేత్త సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్‌కు అల్‌ఖైదాతో సంబంధాలు

ఒసామా బిన్ లాడెన్‌ కు అణ్వాయుధ పరిజ్ఞానం ఇచ్చేందుకు మహమూద్ యత్నం

పాక్ సైన్యంలో జిహాదీ భావజాలం ఉందనడానికి ఇదొక నిదర్శనం

పాకిస్థాన్ సైన్యానికి చెందిన కీలక అధికారి, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి చౌదరి నాయకత్వం వహిస్తుండగా, ఆయన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ ఒక అణు శాస్త్రవేత్త అని, అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌తో సమావేశమై ఉగ్రవాదులకు అణ్వాయుధ పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ పేరు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఉగ్రవాదుల జాబితాలో ఉంది. డిసెంబర్ 24, 2001న అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబన్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మహమూద్‌ను ఈ జాబితాలో చేర్చారు. ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం, ప్రణాళిక రచించడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు ఆయనపై ఉన్నాయి.

“ఉమ్మా తమీర్ ఇ-నౌ (యూటీఎన్)” అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లకు మహమూద్ రసాయన, జీవ, అణ్వాయుధాల సమాచారం అందించినట్లు ఐరాస నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో పర్యటించినప్పుడు మహమూద్, బిన్ లాడెన్ మరియు ఇతర అల్‌ఖైదా నాయకులను కలిసి అణ్వాయుధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 2001లో అప్పటి తాలిబన్ చీఫ్ ముల్లా ఒమర్‌ను కూడా మహమూద్ కలిశారని సమాచారం.

అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను “ఉగ్రవాద బాధిత దేశం”గా చిత్రీకరించేందుకు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రయత్నిస్తుండగా.. ఆయన తండ్రికి ఉన్న ఉగ్రవాద నేపథ్యం చూస్తే పాక్ సైన్యంలో ఉగ్రవాద భావజాలం ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తండ్రి ఒక మత బోధకుడు కాగా, చౌదరి తండ్రి అణు శాస్త్రవేత్త అయినప్పటికీ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడం గమనార్హం. అమెరికా ఒత్తిడి మేరకు 2001లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, మహమూద్‌ను అరెస్ట్ చేసి విచారించింది. ఈ పరిణామాలు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.

Exit mobile version