Site icon PRASHNA AYUDHAM

ఆచార వ్యవహారాలు అవగాహనా ఉద్యమం!

 

 

కాలం ఎంత పరుగెడుతున్నా, కొన్ని ఆచార వ్యవహారాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటాయి. వాటిలో రుతుక్రమానికి సంబంధించిన అంశం ముందుపీఠిన ఉంటుంది. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ, పిన్ని, పెద్దమ్మ, అక్క, వదిన ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఆడపిల్లకి మొదటి రుతుక్రమంపై ఏమాత్రం అవగాహన ఉండదు. ఫలితంగా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తినేంతలా ఆ పిల్ల చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడతాయి. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నిస్తోంది రాజస్థాన్‌ దేవ్‌గఢ్‌ నగరానికి చెందిన భావనా పాలివాల్‌. తను చేస్తున్న ఓ ప్రయత్నం ఇప్పుడు ఆ రాష్ట్ర మారుమూల గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తోంది.భావన స్కూలుకెళ్లే వయసులో మొదటిసారి రుతుక్రమాన్ని ఎదుర్కొంది. ‘ఆ రోజు నాకింకా గుర్తు. రుతుక్రమం గురించి ముందుగా ఏవిధమైన అవగాహన లేకపోవడం వల్ల, నేను చనిపోతానేమో! నాకేదైనా చెడ్డ రోగం వచ్చిందేమో! ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలి? అని చాలా భయపడ్డాను’ అని గతంలో తానెదుర్కొన్న అనుభవాన్ని భావన గుర్తు చేసుకుంది.ఈ పరిస్థితుల్లో ఆ అమాయకపు పిల్లకు సరైన అవగాహన ఇవ్వాల్సిన స్కూలు టీచరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పీరియడ్‌ వచ్చిన భావనకి ఏమీ చెప్పకుండానే ఇంటికి పంపించేశారు. ఈ పరిస్థితి భావనని మరింత భయాందోళనలకు గురి చేసింది. ‘తనకేదో అయిపోయింది. అందుకే ఇంటికి పంపేస్తున్నారు’ అని భావించింది. ఇంటికి వెళ్లాక కూడా అదే పరిస్థితి. తనని దూరంగా ఉంచారు. తిండి, బట్ట అన్నీ దూరంగానే. ‘రోజుల వ్యవధిలోనే ఈ స్థితి నుంచి బయటికి వచ్చినా, మానసికంగా కొన్ని నెలల పాటు భయం భయంగా గడిపాను. ఏదో తెలియని భయం నన్ను వెంటాడింది’ అంటున్న భావన లాంటి ఆడపిల్లలకు ఈ పరిస్థితి సర్వసాధారణం.ఇంట్లో, బయటా, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రుతుక్రమం మొదలైనప్పటి నుంచి ఆంక్షల చుట్టూ బతకాలి. రోజులపాటు ఇలాగే ఉంటే ఎంత కుంగిపోతాం! మా భవిష్యత్తుపై ఇది ఎంత విపరీత పరిణామాల్ని తీసుకొస్తుంది? అని ఎవరూ ఆలోచించరా’ అని చిన్నప్పటి నుండే ఆలోచించేదాన్ని. పెద్దాయ్యాక ఈ పరిస్థితిలో మార్పు తేవాలని కూడా అనుకునేదాన్ని’ అంటున్న భావన బాల్యంలో బలపడ్డ ఆలోచనను ఇప్పుడు ఆచరణలో పెడుతున్నారు. ఉన్నత విద్య అభ్యసించిన ఆమె, తన చుట్టూ ఉన్న ఆడపిల్లలు ఇప్పటికీ నాటి పరిస్థితినే అనుభవిస్తున్నారని తెలుసుకుంది. ఆ భయంతో విద్యకు దూరమవుతున్నారని తెలిసి తల్లడిల్లిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కార్యాచరణను మొదలుపెట్టింది. స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థతో కలిసి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

సంస్థ తరపున రుతుక్రమ ఆరోగ్యం, అవగాహనపై వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు తొలగేలా గ్రామగ్రామానికి తిరిగి ప్రజల్లో చైతన్యం నింపుతోంది. కరోనా సమయంలో కూడా ఆన్‌లైన్‌ వేదికగా పలు సెషన్లు నిర్వహించింది. ఇప్పటి వరకు 500 పైగా వర్క్‌ షాపులు నిర్వహించింది. పది వేల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది.భావన లాంటి ఆడపిల్లలు ఇప్పుడు చాలాచోట్ల కనిపిస్తున్నారు. రుతుక్రమ అవగాహన, పరిశుభ్రత, అపోహలపై శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. మార్పు కోసం తొలి అడుగులు వేస్తున్నారు. అయినా సమాజంలో ఏదో ఒక మూల గ్రామాలు, నగరాలు అన్న తేడా లేకుండా రుతుక్రమం చుట్టూ అపోహలు, భయాలూ అల్లుకొని ఉండడం విచారకరం!

Exit mobile version