గ్రామ పంచాయతీల్లో పకడ్బందీగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి – కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
డెంగ్యూ, డయేరియా వ్యాప్తి అరికట్టాలని సూచన
సంతాయిపేటలో పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలన
నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్, ఫాగింగ్ తప్పనిసరి
డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశం
ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి జిల్లా ఇంచార్జీ
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 20
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఉద్దేశించి, “డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి” అని ఆదేశించారు.
బుధవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్, పంచాయతీ సిబ్బందితో కలిసి వర్షపు నీరు నిలిచిన డబ్బాలను ఖాళీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాల కారణంగా నీరు నిలిచే అవకాశం ఉన్నందున వెంటనే గుర్తించి బయటకు పోయేలా చూడాలి, లేకపోతే ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదల నివారించాలన్నారు. డ్రైనేజీల్లో నీరు నిలవకుండా తరచూ శుభ్రం చేయాలని, ఫాగింగ్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా, ప్రజలకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అత్యవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవో సాజిద్ అలీ, తాసిల్దార్ శ్వేత, ఎంపీఓ సరిత రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.