*_అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే!..భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం..!!_*
ఇష్టమొచ్చినట్లు అప్లికేషన్లను తిరస్కరిస్తున్న అధికారులు
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
తిరస్కరణకు లిఖితపూర్వకంగా
కారణం చెప్పాలన్న సర్కార్ రెవెన్యూ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా
8 లక్షలకు పైగా దరఖాస్తులుప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క భూ సంబంధిత దరఖాస్తునూ.. నిర్ధిష్టమైన, లిఖితపూర్వకమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టమొచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అందుకు కచ్చితమైన, సరైన కారణాన్ని చూపాల్సిందేనని ఆదేశించింది. గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ.. వాటిని కారణంగా లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు మళ్లీ రెవెన్యూ సదస్సుల్లో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఫీల్డ్ లెవెల్ లోనూ తహసీల్దార్లు ఇష్టారీతిన దరఖాస్తులు తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సర్కారు, దీనికి కళ్లెం వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గతంలో మాదిరి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించొద్దని, అక్రమాలకూ తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నది.
వాస్తవానికి భూ భారతి చట్టం ప్రకారం.. భూ భూరతి పోర్టల్లో ఏ అప్లికేషన్ పెట్టుకున్నా.. వాటిని రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం పెద్దఎత్తున అప్లికేషన్లు రావడంతో వాటిని డిస్పోజ్ చేసేందుకు లేనిపోని కారణాలు పెట్టి తిరస్కరణ చేయడం ఉండకూడదని, అవినీతికి ఆస్కారం ఉండొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో రైతులు లబ్ధి పొందనున్నారు.
*_మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు_*
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన వచ్చింది. ఈ సదస్సుల్లో భూమికి సంబంధించిన రకరకాల సమస్యలపై ప్రజల నుంచి 8 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో వారసత్వ భూముల బదిలీలు, భూ రికార్డుల సవరణలు, సరిహద్దు వివాదాలు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ, మిస్సింగ్ సర్వే నంబర్లు, నాలా కన్వర్షన్లు వంటి ఎన్నో అప్లికేషన్లు ఉన్నాయి.
అయితే, ఈ దరఖాస్తుల్లో పైలట్ మండలాల్లో చాలా వరకు ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే అధికారుల నుంచి అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వాన్ని చేరాయి. దీనివల్ల ప్రజలు మళ్లీ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, కాలయాపనతో పాటు భూ భారతి పోర్టల్ లో అప్లికేషన్ పెడితే ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన లక్షలాది దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, వాటిని తిరస్కరించే ముందు పరిశీలించి సరైన కారణం చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. కొంతమంది తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిశీలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, సరైన కారణాలు చూపకుండానే తిరస్కరిస్తున్నారని ఇటీవల ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై తిరస్కరణకు గురైన ప్రతి దరఖాస్తుకు, అందుకు గల పూర్తి కారణాన్ని వివరంగా అప్లికెంట్కు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. ఆ కారణం చట్టబద్ధంగా ఉందా? లేదా? అనే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం దరఖాస్తుదారులకు లభిస్తుంది. అంతేగాకుండా, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది.
*_మరో ధరణి కావొద్దనే.._*
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్.. రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. లక్షల సంఖ్యలో కొత్త భూ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ధరణిని బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సలహాలు, సూచనలతో భూ భారతి చట్టాన్ని తెచ్చింది.
ఇందులో అప్పీళ్లు, ల్యాండ్ ట్రిబ్యునళ్ల వ్యవస్థను తీసుకొచ్చింది. భూ సమస్యల అప్లికేషన్ తిరస్కరిస్తే కారణం చెప్పాలని స్పష్టం చేసింది. దాంతో పాటు తప్పు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే నిబంధన కూడా పెట్టింది. గతంలో తమ దరఖాస్తు ఎందుకు తిరస్కరించబడిందో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు ఇప్పుడు తమ హక్కులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సరైన కారణం లేకపోతే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే చాన్స్ కూడా లభిస్తుంది.