*_సర్పంచ్ ఎన్నికలు. BRS కీలక నిర్ణయం..!!_*
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని తెలియచేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరాఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని చెప్పాలన్నారు. రేవంత్ ప్రభుత్వ చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారి గ్రామాల్లో పారిశుద్ద్యం పడకేసిందన్న సంగతిని చెప్పాలన్నారు.