ఎస్బీఐ – జెఎన్టీయూహెచ్ క్యాంపస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
ప్రశ్న ఆయుధం జూన్23: కూకట్పల్లి ప్రతినిధి
ఎస్బీఐ 70వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెఎన్టీయూహెచ్ క్యాంపస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ నీలోఫర్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్ సహకారంతో మరియు ఎన్ఎస్ఎస్ సెల్, జెఎన్టీయూహెచ్ మద్దతుతో, ఎస్బీఐ 70వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరంను సోమవారం రోజున జెఎన్టీయూహెచ్ హెల్త్ సెంటర్లో విజయవంతంగా నిర్వహించారు.
ఈ శిబిరం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై, 150 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్తదానం ద్వారా సేవా భావన, సామాజిక బాధ్యత, మరియు వైద్య అవగాహన విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ సందర్భంగా జెఎన్టీయూహెచ్ ఉపకులపతి ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రక్తదానం అనేది గొప్ప మానవతా సేవ. జెఎన్టీయూహెచ్ విద్యార్థులు ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండటం గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానవీయత, బాధ్యత భావం మరింత పెరుగుతుంది.
జెఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై, సేవా కార్యక్రమాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు.
విశ్వవిద్యాలయ వైద్య అధికారులు శిబిరాన్ని వైద్య ప్రమాణాలకు అనుగుణంగా పర్యవేక్షించారు. రక్తదానం ప్రక్రియ సమర్థంగా, సురక్షితంగా పూర్తయింది.
రక్తదాతలకు ఎన్ఎస్ఎస్ సెల్ తరఫున ప్రామాణపత్రం మరియు ఎస్బీఐ తరఫున రూ. 500 విలువ గల గిఫ్ట్ వౌచర్ అందజేసారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్. శోభా రాణి సమన్వయం చేయగా, వాలంటీర్లు, విద్యార్థులు, సిబ్బంది మరియు ఎస్బీఐ సిబ్బంది సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.