ఏపీలోని డిప్యూటీ కలెక్టర్ కు షాక్…

ఏపీలోని డిప్యూటీ కలెక్టర్ కు షాక్…

తహసీల్దార్ స్థాయికి డీమోట్ చేయాలంటూ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న తాతా మోహన్‌రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనను తహసీల్దార్‌ స్థాయికి డిమోట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించిన ఉదంతంలో ఈ తీర్పు వెలువడింది.

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ కేసులో మోహన్‌రావుకు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి జైలులో ఉంటే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని, దీనివల్ల ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని మోహన్‌రావు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని, కోర్టు విధించే ఏ శిక్షకైనా అంగీకరిస్తామని వారు విన్నవించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జైలుశిక్షకు బదులుగా మోహన్‌రావును డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తహసీల్దార్‌ స్థాయికి తగ్గించాలని (డిమోట్) ఆదేశించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “గుడిసెలను తొలగించి, అందులో నివసిస్తున్న వారిని రోడ్డుపైకి నెట్టివేసినప్పుడే ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది. పిటిషనర్‌ మొండితనం, నిర్లక్ష్య వైఖరి వల్ల ఆయన కుటుంబ సభ్యులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జైలుశిక్ష విషయంలో ఉదార వైఖరి అవలంబించాం. అయితే, ఎంతటివారైనా చట్టానికి అతీతులు కాదన్న సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నాం” అని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మోహన్‌రావు పేదల ఇళ్ల నిర్మాణం నిమిత్తం నాలుగు వారాల్లోగా రూ.లక్ష జరిమానా చెల్లించి, అందుకు సంబంధించిన రసీదును కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా, భవిష్యత్తులో పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు 2015 మార్చి 27న మోహన్‌రావుకు రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొందరు రాత్రికి రాత్రే వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని ఆయన తన వాదనలు వినిపించారు.

జైలు శిక్షను తప్పించుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తహసీల్దార్‌ పదవికి తగ్గడానికి అంగీకరిస్తూ హామీపత్రం (అండర్‌టేకింగ్‌ లెటర్‌) ఇవ్వాలని గత వాయిదాల్లోనే సుప్రీంకోర్టు సూచించినప్పటికీ, పిటిషనర్‌ అందుకు అంగీకరించకపోవడంపై జస్టిస్‌ గవాయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. “పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరించి ఉంటే రెండు, మూడు ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు ఈ విషయాన్ని లాగారు. ఈ రోజు కూడా మా సూచనను అంగీకరించకపోతే ఏ ప్రభుత్వమూ సాహసించలేని ఉత్తర్వులు జారీ చేసేవాళ్లం. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు మాకూ బాధగానే ఉంటుంది, కానీ మేం నిస్సహాయులం” అని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment