సింగరేణి జల, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి

సింగరేణి జల, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి

నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి

ఇంధన శాఖ అన్ని విభాగాల ప్రాజెక్టుల పర్యవేక్షణకు డ్యాష్ బోర్డు

సింగరేణి పై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

సింగరేణి సంస్థ చేపట్టనున్న 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాట్ల సన్నాహాలను మరింత వేగవంతం చేయాలని, కాల పరిమితిని విధించుకొని సత్వరమే ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.

శనివారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ లో సింగరేణి కాలరీస్ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టనున్న సోలార్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, ఇతర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి సంస్థ లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ పై నిర్మించనున్న 300 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, మల్లన్న సాగర్ పై నిర్మించతలపెట్టిన 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ లకు ఇరిగేషన్ శాఖ ద్వారా రావాల్సిన అనుమతులకు లేఖలు రాయాలని ఆదేశాలు ఇచ్చారు. అనుమతుల కోసం నిత్యం సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టును పూర్తి లాభదాయకంగా చేపట్టేలా ఆదేశాలు ఇచ్చారు.

అలాగే సింగరేణి సంస్థ రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో ఏర్పాటుచేయ తలపెట్టిన 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించిన డిపిఆర్ లను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టును మరింత ఆమోదయోగ్యంగా మార్చేందుకు వీలుగా అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు.

రామగుండం-1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ నీటి సంపు ఆధారంగా నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.

అలాగే రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఆ రాష్ట్రంలోని సోలార్ వ్యాలీలో త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసే 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటుపైనా కూలంకశంగా చర్చించారు. రాజస్థాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ అంశాన్ని వీలైనంత త్వరగా క్యాబినెట్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ ప్లాంట్ లతోపాటు సింగరేణి ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టం వంటి ఇతర పనులపై కూడా ఆయన నిశితంగా సమీక్షించారు. ఇంధన శాఖకు సంబంధించిన అన్ని విభాగాల పనితీరును, చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా డాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించారు.

పథకాల అమలులో వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ . బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ చేపట్టనున్న సోలార్, ఫ్లోటింగ్ సోలార్, పునరుత్పాదక ప్రాజెక్టులకు సంబంధించి వివరించారు.

సింగరేణి సంస్థ ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 7 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనుకుంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుండి పలు రకాల అనుమతులు ఇప్పించవలసిందిగా కోరారు. ఈ వ్యాపార విస్తరణ చర్యల వల్ల సంస్థ సుస్థిర భవిష్యత్ సాధ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, తెలంగాణ రెడ్కో వైస్ ఛైర్మన్, ఎండీ  ఆనీలా, సింగరేణి ఈడీ(కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం సుభాని, ఈడీ (ఎస్టీపీపీ) చిరంజీవులు, జీఎంలు జానకీ రామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment