అక్టోబర్ 2 నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంఈ
ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సర్క్యులర్ ఎకానమీ’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుపై ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలను పరిశీలించారు.