*ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!*
సోఫియా ఖురేషీ.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ చేసిన పోరాటంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది.
సోఫియా ఖురేషీ.. పాక్, ఇండియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచదృష్టిని ఆకర్షించిన ధీర వనిత. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత వార్తల్లో నిలిచిన ఈ భారత సైన్యం మహిళా అధికారిణి.. విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అదుకుంటున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని, పాక్ బాగోతాన్ని బట్టబయలు చేసిన తీరుతో ఒక్కసారిగా యావత్తు దేశాన్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ప్రశంస ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. 5ఏళ్ల క్రితం 2020లో సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు వెల్లడించినపుడు సోఫియా పేరు వార్తల్లోకి ఎక్కారు.
*ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్*
ఈ మేరకు ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ సోఫియా పోరాటం చేశారు. మహిళా సైనికాధికారుల న్యాయపోరాటంలో సుప్రీంకోర్టుకు వెళ్లగా సంచలన తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ఆర్మీలో ఆమె సేవలను గుర్తించిన ధర్మాసనం.. మహిళలూ ఆర్మీలో శాశ్వత కమిషన్కు అర్హులేనని 2020 ఫిబ్రవరి 17న స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోఫియా సైన్యంలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ.. ‘భారతదేశం ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక వ్యాయామం ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18′. ఈ బహుళజాతి సైనిక వ్యాయామంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషిని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని న్యాయస్థానం పొగిడింది.
*‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’కు నాయకత్వం..*
2016లో ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’ పేరిట పుణెలో మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించారు. దీనికి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. అంతేకాదు ఈ బాధ్యతను చేపట్టిన మొదటి ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. కల్నల్ సోఫియా ఖురేషి 2006లో కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో పనిచేశారు. అక్కడ ఆమె కాల్పుల విరమణలను పర్యవేక్షించడం, మానవతా కార్యకలాపాలలో సహాయం చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు.