తల్లిని హత్య చేసి మంజీరా నదిలో పడేసిన కుమారుడు,
కేసు చేదనలో సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వాడకం కీలకం
నిందితుల వద్ద నుండి బైక్, సెల్ఫోన్లు స్వాధీనం
ప్రధాన నిందితుడు రిమాండ్కు, మరో కిశోర నిందితుడు జువెనైల్ హోంకు తరలింపు
“నేరం చేస్తే తప్పించుకోలేరు” – జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ స్పష్టం
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 14
తల్లి హత్యకు కుమారుడు – పోలీసులు విప్పిన గుట్టు
బాన్సువాడ: తల్లి పట్ల కరుణ చూపాల్సిన కుమారుడు కర్కశంగా ప్రాణం తీశాడు. మానవత్వాన్ని కలచివేసిన ఈ ఘోర హత్య కేసును బాన్సువాడ పోలీసులు చేధించారు.
సెప్టెంబర్ 11న బొల్లక్ పల్లి శివారులోని మంజీరా నదిలో గుర్తుతెలియని వృద్ధురాలి శవం తేలడంతో కేసు నమోదైంది. పిట్లం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించి, వాట్సాప్–సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పంచి విచారణను వేగవంతం చేశారు.
దర్యాప్తులో బోర్లం గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగాలేక, ఇంట్లోనే విసర్జన చేస్తున్న తల్లి సాయవ్వ (77)ను తన కుమారుడు ఎర్రోళ్ల బాలయ్య (46) దయ లేకుండా బైక్పై తీసుకెళ్లి, సెప్టెంబర్ 8 రాత్రి బొల్లక్ పల్లి బ్రిడ్జ్ వద్ద మంజీరా నదిలో తోసి హత్య చేసినట్టు వెల్లడైంది. ఈ పనిలో అతనికి ఒక బాలుడు సహకరించాడు.
నమ్మదగిన సమాచారంతో పోలీసులు సెప్టెంబర్ 14న కొయ్యగుట్ట చౌరస్తా వద్ద ఇద్దరినీ అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి హత్యలో ఉపయోగించిన బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలయ్యను రిమాండ్కు తరలించగా, కిశోరుడిని జువెనైల్ హోంకు పంపారు.
ఈ కేసు చేదనలో బాన్సువాడ డీఎస్పీ విటల్ రెడ్డి పర్యవేక్షణలో, రూరల్ సీఐ తిరుపతయ్య, ఎస్ఐ వెంకటరావు తదితరులు పనిచేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ సిబ్బందిని అభినందిస్తూ, “నేరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు” అని హెచ్చరించారు.