ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
-కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు గోదాములకు తరలించాలి
-నిర్ణీత సమయంలో ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయాలి
-ప్రశాంతంగా గ్రూప్- 3 పరీక్షలు నిర్వహించాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:
ధాన్యం, పత్తి కొనుగోళ్ళు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, గ్రూప్ -3 పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ధాన్యం, పత్తి కొనుగోళ్ళు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల, గ్రూప్ -3 పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షలు మాదిరిగానే నవంబర్ 17, 18న జరిగే గ్రూప్-3 పరీక్షలను పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ షీట్ల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను చెక్ చేసేందుకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాలని సిఎస్ తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం, ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపు అంశాలను పరిశీలించాలని సీఎస్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని, దొడ్డు వడ్లు కలవకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని, వివరాలు నమోదు చేసిన, 48 గంటలు వ్యవధిలో నగదు చెల్లించడం జరుగుతుందని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా రద్దీ ఉండకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. రెగ్యులర్ గా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ఉన్నత అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. కొనుగోలు ప్రక్రియపై వచ్చే వ్యతిరేక వార్తలకు స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు పత్తి పంట కొనుగోలుపై సైతం శ్రద్ధ వహించాలని అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని అన్నారు. సర్వే వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు అవసరమైన మేర కంప్యూటర్ సిస్టంలను సిద్ధం చేయాలని అన్నారు. నవంబర్ 16 నుంచి డేటా ఎంట్రీ ప్రారంభించాలని సిఎస్ తెలిపారు. డేటా ఎంట్రీ కోసం గుర్తించిన ఆపరేటర్లు, కంప్యూటర్ సిస్టం మొదలగు ఏర్పాట్ల వివరాల నివేదికలను సమర్పించాలని సిఎస్ తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్ -3 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, 5 లక్షల 36 వేల 395 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని తెలిపారు. పరీక్ష హాల్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని, ఎక్కడ ఎటువంటి పొరపాటు రాకుండా చూసుకోవాలని అన్నారు. గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌళిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన మేర పోలీస్ సిబ్బందిని చెకింగ్ కోసం అందుబాటులో ఉంచాలని అన్నారు.పరీక్ష నిర్వహించే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని అన్నారు. పరీక్ష వ్రాసే విద్యార్థులకు అవసరమైన త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, పరీక్ష కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, బెల్ ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, ఎవరు ఫోన్ తీసుకొని రావద్దని అన్నారు. పరీక్షా కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు మూసి వేయాలని సూచించారు. ఉదయం సెషన్ పరీక్ష కేంద్రాల గేటు 9-30 గంటలకు, మధ్యాహ్నం 2-30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖ ల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
by kana bai
Published On: November 13, 2024 10:30 pm