**సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో వేగం, పారదర్శకత తప్పనిసరి – అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 26
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
ప్రజలకు సకాలంలో అవసరమైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషించాలంటూ, వివిధ రకాల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో గడువులోపు స్పందన అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన కుత్బుల్లాపూర్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీ-సేవా ద్వారా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ రికార్డులు, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు.
**సర్టిఫికెట్ల జారీపై స్పష్టమైన ఆదేశాలు:**
కులం, ఆదాయం, స్థానికత వంటి వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నిబంధనల మేరకు పూర్తిగా పరిశీలించి, తక్షణమే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిపాలనా ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
**భూముల స్థితిగతులపై సమీక్ష:**
అదనపు కలెక్టర్ అనంతరం గాజులరామారం ప్రాంతంలోని సర్వే నంబర్లు 307, 342 కింద ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన మ్యాప్లు, హద్దులు, ఇతర వివరాలను అధికారుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డీఓ శ్యామ్ప్రసాద్, తాత్కాలిక తహశీల్దార్ స్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.