*తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం*
కామారెడ్డి, మే 9: కర్రెగుట్ట తండాలో జరిగి ల్యాండ్ మైన్ పేలుడులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ (26) మృతి చెందాడు. శ్రీధర్ మరణవార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితమే శ్రీధర్ ఉద్యోగంలో చేరాడు. శ్రీధర్కు తొమ్మిది నెలల క్రితమే శ్రీవాణితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో గ్రామంలో ప్రతీఒక్కరు కంటతడి పెడుతున్న పరిస్థితి.
కాగా.. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ పేలుడులో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 7న కూంబింగ్ కోసం పోలీసులు వెళ్లగా నిన్న (గురువారం) తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు గ్రౌహౌండ్స్ పోలీసులు అక్కడికిక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన పవన్ కళ్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్ ఐఈడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే మృతదేహాలను ప్రత్యేక హెలికాఫ్టర్లో ములుగుకు తరలించి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అంతేకాకుండా ఈ పేలుడు అనంతరం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్యం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్ఎస్సై రణధీర్ గాయపడగా.. ఆయనను కూడా వెంటనే హైదరాబాద్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరణించిన కానిస్టేబుళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం హనుమకొండ హెడ్క్వార్టర్స్కు తరలించారు. మరోవైపు ఈ పేలుడు అనంతరం కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా.. వారిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్.జెడ్.సీ.మెంబర్ బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు..