సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): అందోల్ నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. బుధవారం పుల్కల్ మండలం బస్వాపూర్ లో 125 కోట్లతో 33 ఎకరాలలో నిర్మించనున్న సమీకృత గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందోల్ ప్రాంతం విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమని గతంలో సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో నియోజకవర్గంలో మూడు పాలిటెక్నిక్ కళాశాలలు, సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాల, టెక్మల్, అలాదుర్గు రేగోడు మండలాలలో మోడల్ పాఠశాలలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం విద్య వైద్య రంగాలలో వెనుకబడి ఉండడంతో విద్యా వైద్య రంగాల అభివృద్ధి ద్వారా నిరుపేద ప్రజల జీవితాలలో మార్పు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ఇక్కడే ఉన్నత విద్యాభ్యాసం పొందేలా అవసరమైన అన్ని రకాల కళాశాలలు, పాఠశాలలు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుల్కల్ మండలం బస్వాపూర్ లో రూ .125 కోట్లతో నిర్మించనున్న సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో విద్యారంగంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయన్నారు. ఇక్కడి విద్యాసంస్థలలో ఇక్కడి విద్యార్థులు ప్రవేశం పొందేలా స్థానిక ప్రజలు చొరవ చూపి ప్రభుత్వం కల్పిస్తున్న విద్య వైద్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం నేర్పేలా అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడానికి అవసరమైన వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వైద్యరంగం అభివృద్ధి కోసం వట్పల్లిలో రూ. 30 కోట్లతో 30 పడకల ఆసుపత్రి, జోగిపేటలో 150 పడకల ఆసుపత్రి మంజూరు చేసినట్లు తెలిపారు త్వరలో నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న 15 రోజుల్లో సుమారు 168 కోట్ల రూ ” లతో సింగూర్ పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి దామోదర్ తెలిపారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ మాట్లాడుతూ విద్యారంగా అభివృద్ధి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్థాయి మోడల్ పాఠశాలలలను సమీకృత గురుకుల పాఠశాలలుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక కృషి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
Updated On: October 16, 2024 7:53 pm
