*డయేరియా నివారణకు ముందడుగు: నారాపల్లిలో ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం ప్రారంభం*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 19
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ క్యాంపెయిన్కు గురువారం నారాపల్లిలో శుభారంభం జరిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి నారాపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరిగిన అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్యం కోసం ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ క్యాంపెయిన్లో భాగంగా డయేరియా నివారణ కోసం పలు కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలో అంతర్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించబడింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ మరియు జింక్ మాత్రల సరఫరాను అంచనా వేసి, అవసరమైన చోట్ల పంపిణీ చేపట్టారు. చిన్న పిల్లలకు, విద్యార్థుల ద్వారా చేతులు కడగడం, శుభ్రతపైన పాఠాలు చెప్పే పీర్ టు పీర్ లెర్నింగ్ సెషన్లు నిర్వహించడం ద్వారా ఆరోగ్యశీలాలను పెంపొందించడంపై దృష్టి సారించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు విద్యార్థులను తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించారు. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక వర్క్షాప్లు కూడా నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయం, కమ్యూనిటీ మరియు విద్యా సంస్థల భాగస్వామ్యంతో మాత్రమే డయేరియా వంటి వ్యాధులపై పూర్తి నియంత్రణ సాధించగలమని డా. ఉమా గౌరి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సత్యవతి, జిల్లా టీకాల అధికారి మరియు క్యాంపెయిన్ నోడల్ అధికారి డా. కౌశిక్, నారపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. శోభనా, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కూడా పాల్గొన్నారు.