ఆకస్మికంగా పర్యటించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిషెట్టి
జుక్కల్ ఆర్సీ అక్టోబర్ 16 ప్రశ్న ఆయుధం
నిజాంసాగర్ మండలంలోని బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికొప్పిషెట్టి పర్యటించారు. దళిత బంధు పథకం సక్రమంగా అమలు అయ్యిందా? లేదా అనే అంశాలపై ఆరా తీశారు. దళిత బంధు పథకం మంజూరులో లబ్ధిదారులకు ఎదురైనా సమస్యలను తన దృష్టికి తీసుక రావాలని సూచించారు. పేదల కోసం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో అక్రమాలు ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితులు తనకు పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానన్నారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మైయి కొప్పిశెట్టి బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి గదులలో పర్యటించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు తయారుచేసిన పలు మేధాశక్తికి సంబంధించిన గ్యాలరీను తిలకించి అభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాల్సి ఉండగా మెనూ పాటించడం లేదని మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై మండిపడ్డారు.
అనంతరం అచ్చంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడారు. ఐదుగురు లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందజేసిన పది లక్షల రూపాయల యూనిట్ను సద్వినియోగం చేసుకున్నారా దళారులు ఎవరైనా ఏమైనా డబ్బులు తీసుకున్నారా అంటూ వారిని అడగగా అలాంటిది ఏమీ లేదని 10 లక్షలను తాము సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. తహసీల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో గోల్బంగ్లా సమీపంలో సర్వే నంబర్ 121లో టూరిజం కోసం ఇటీవల నాలుగు ఎకరాల భూమిని కేటాయించడంతో అట్టి భూమిని ఆమె పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని టూరిజం కోసం కేటాయించిన నాలుగు ఎకరాలు అణువుగా ఉందని ఆమె అన్నారు. ఆమె వెంట తహసిల్దార్ బిక్షపతి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంజయ్య, సర్వేయర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.