*విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన కలెక్టర్: బాచుపల్లి, బౌరంపేట పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 18
కృషి, పట్టుదల, క్రమశిక్షణే విజయానికి మూలమని, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకుని అదే స్ఫూర్తితో చదువుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
బుధవారం, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి జిల్లాలోని బాచుపల్లి, బౌరంపేటలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను భవిష్యత్తులో ఏమి చదువుతారు, ఏ గ్రూపు తీసుకుంటారని అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని వారికి సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నేరుగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు పాఠశాలలో క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఎగుడుదిగుడుగా ఉన్న క్రీడా మైదానాన్ని చదును చేయించాలని కోరారు. విద్యార్థులు అడిగిన అంశాలను తప్పకుండా పూర్తి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన అంశాలతో నివేదిక తయారు చేసి తనకు అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. గతంలోనే అదనపు గదుల కోసం నివేదిక పంపామని ప్రిన్సిపల్ తెలపగా, మళ్లీ నోటు పెట్టాలని, అవసరమైన వసతులను కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.