*టాటా X ఫోర్డ్.. చిన్న కథ కాదు*
రతన్ టాటా, ఆయన బృందం డెట్రాయిట్కు వెళ్లి అప్పటి ఫోర్డ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ను కలిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన లావాదేవీని ముందుకు తీసుకువెళ్లడం ఈ సమావేశం ఫలవంతం కాలేదు. పైగా రతన్టాటాను అవమానించే విధంగా బిల్ ఫోర్డ్ మాట్లాడారు. ‘మీకు ఏమీ తెలియదు. అయినా ఎందుకు కార్ల వ్యాపారం ప్రారంభించారు. మీ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీకు మేలు చేస్తున్నాం’ అని బిల్ ఫోర్డ్ పేర్కొన్నారట. ఫలితంగా ఫోర్డ్కు కార్ల వ్యాపార విభాగాన్ని విక్రయించాలనే లావాదేవీ నిలిచిపోయింది. వెంటనే భారత్ వచ్చేసిన రతన్ టాటా.. టాటా మోటార్స్ కార్ల వ్యాపారాన్ని విక్రయించడం ఆపేసి, ఇండికాను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భద్రమైన కారు కావడం, దేశీయ రహదార్లపై ప్రయాణానికి అనుకూలంగా ఉందనే నమ్మకం పెరగడంతో.. ఇండికా కార్ల వ్యాపారం పుంజుకుని గాడిలో పడింది. టాటా మోటార్స్ కార్ల వ్యాపార తీరునే ఇది మార్చేసింది. 10 లక్షలకు పైగా ఇండికా కార్లు అమ్ముడయ్యాయి.
అమెరికాలో రతన్ టాటాకు అవమానం జరిగిన 9 ఏళ్ల తర్వాత.. 2008లో అమెరికాలో మహా మాంద్యం రావడంతో ఫోర్డ్ మోటార్స్ దివాలా అంచుకు చేరింది. ఈ సమయంలో ఫోర్డ్కు చెందిన దిగ్గజ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేస్తామని టాటా ఆఫర్ చేశారు. 2008 జూన్లో 2.3 బిలియన్ డాలర్లకు ఈ లావాదేవీ పూర్తయింది. ఈ సందర్భంగా రతన్ టాటాకు బిల్ ఫోర్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. టాటా మోటార్స్కు కీలకంగా కూడా మారాయి. ఆ రకంగా ఫోర్డ్ అవమానించినా, రతన్ టాటా మంచి మనసుతో ఆ కంపెనీని ఆదుకోవడమే కాక, టాటా గ్రూప్నకూ మంచి ఆదాయ వనరును, దిగ్గజ బ్రాండ్లను సమకూర్చి పెట్టారు.