*తెలంగాణ ప్రభుత్వం ‘ఆపరేషన్ చేయూత’ ఎఫెక్ట్… 38 మంది మావోయిస్టుల లొంగుబాటు*
ఛత్తీస్గఢ్లో వివిధ కేడర్లలో పనిచేసిన సభ్యులు
లొంగిపోయినవారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేత
ఈ ఏడాది ఇప్పటివరకు 265 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడి
తెలంగాణ ప్రభుత్వ కల్పిస్తున్న పునరావాస విధానాలు, శాంతియుత జీవనంపై ఆశతో, నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట ఈ 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు పార్టీ సభ్యులు, 16 మంది మిలీషియా సభ్యులు, ఏడుగురు గ్రామ కమిటీ సభ్యులు, ఆరుగురు క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ సభ్యులు, ముగ్గురు చేతన నాట్యమంచ్ సభ్యులు, నలుగురు గెరిల్లా రివల్యూషనరీ డిస్ట్రిక్ట్స్ సభ్యులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి పునరావాసం నిమిత్తం ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సహాయంగా చెక్కులను ఎస్పీ అందజేశారు.
జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలనుకునే పార్టీ సభ్యులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఉన్నతాధికారులను వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, నేరుగా గానీ సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన పార్టీ సభ్యుల జీవనోపాధికి, పునరావాసానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలు అందేలా జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. “తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే, వారికి ప్రత్యేక నగదు పురస్కారాలు, ఇతర పునరావాస సౌకర్యాలు తక్షణమే అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుంది” అని ఆయన తెలిపారు.