Site icon PRASHNA AYUDHAM

వచ్చే వారమే స్థానిక షెడ్యూల్‌?.. ఎన్నికల సన్నాహాల్లో బిజీగా తెలంగాణ ఎస్‌ఈసీ..!!

IMG 20250622 WA0457

*_వచ్చే వారమే స్థానిక షెడ్యూల్‌?.. ఎన్నికల సన్నాహాల్లో బిజీగా తెలంగాణ ఎస్‌ఈసీ..!!_*

రేపటి క్యాబినెట్‌ భేటీలో అదే ప్రధాన ఎంజెండా..!

రైతుభరోసా నిధుల జమ పూర్తయిన వెంటనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల?

హైదరాబాద్‌, జూన్‌ 22 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనున్నదా.

వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడనున్నదా? అంటే అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయవర్గాలు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే మంత్రులతో జరిగిన సమావేశాల్లోనూ ఎన్నికల సన్నాహాలపై ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. అనవసర ప్రకటనలు లేకుండా, పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని సూచించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు సహా మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

రైతుభరోసా పథకం కింద నిధులు జమచేసే ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారిక నోటిఫికేషన్‌ వెలువడనున్నట్టు సమాచారం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికసాయం అందించి గ్రామీణ ఓటర్ల మద్దతు పొందాలని చూస్తున్నట్టు తెలిసింది. అందుకే గత వేసవిలో మూడెకరాలకే రైతు భరోసా నిధులను విడుదల చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. గ్రామీణ ఓటర్ల కోసం ఇప్పుడు అందరికీ వేయాలని భావిస్తున్నది.

సోమవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో రైతుభరోసా నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంశాలే ప్రధాన ఎజెండా చర్చించనున్నట్టు తెలిసింది. రాజీవ్‌ యువవికాసం పథకం వాయిదా పడిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా పథకాలు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్‌ సర్కారు ఆశతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

*_రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు_*

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికలకు ముందే రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తికి కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (టీఎస్‌ ఈసీ) ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నది. 70,000 బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేయడంతోపాటు, ఓటరు జాబితాలు, పోలింగ్‌స్టేషన్ల వివరాలను ఖరారు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డులతోపాటు 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.

Exit mobile version