*భీకర యుద్ధం..అయినా భయపడకుండా పదేళ్ల పిల్లాడు ఆర్మీకి సాయం..*
ఆపరేషన్ సింధూర్ లో వీర జవాన్లతో పాటూ ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా తారావాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ కాల్పుల మోతలో కూడా భయపడకుండా జవాన్లకు సాయం చేశాడు. మామూలుగా అయితే భారత్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతారు. కానీ శ్రవణ్ మాత్రం అలా అనుకోలేదు. తన వయసు పదేళ్లే అయినా అంతకు మించి ఆలోచించాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా జవాన్లకు తాగడానికి మంచినీళ్లు, పాలు, లస్సీ లాంటివాటిని అందించాడు. అందుకే ఈ బుడ్డోడు ఇప్పుడు వారియర్ అయ్యాడు.
*బాంబులు పడుతున్నా మొక్కవోని ధైర్యం..*
వయసు లేదు, యూనిఫామ్ లేదు…కానీ ధైర్యం మాత్రం చాలా ఉంది. పెద్దయ్యాక ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నాడు. దాని కోసం ఇప్పటి నుంచే తన నిబద్ధతను చూపించాడు. యూనిఫామ్ లేదు. ఆయుధాలు లేవు. కానీ, గుండెనిండా ధైర్యం ఉంది. సైన్యంలో చేరకముందే యుద్ధ రంగంలో తనవంతు పాత్ర పోషించాడు. తూటాల చప్పుళ్లు, బాంబు దాడులకు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలిచాడు. ఆ ధైర్యమే ఇప్పుడు శ్రావణ్ సింగ్ను సర్దార్ని చేసింది.
పాకిస్తాన్ తో పోరాడేందుకు భారత సైన్యం శ్రవణ్ తండ్రి సోనా సింగ్ పొలంలో శిబిరం వేసుకున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరూ ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేదు. కానీ శ్రవణ్ మాత్రం రోజూ తన చిట్టి చేతులతో సైనికుల దాహార్తిని తీర్చాడు. జవాన్లకు మంచినీళ్లు, పాలు, లస్సీ, ఐస్ తీసుకెళ్లాడు. ఒక పక్క ఎండ మండిపోతోంది.. మరోవైపు పాకిస్థాన్ నుంచి ఎప్పుడు ఏ మిసైల్ వస్తుందోనన్న భయంతో ప్రజలు వణికిపోతుంటే.. శ్రావణ్ సింగ్ మాత్రం రోజూ సైనికుల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. మీతో మేమున్నాం అంటూ సైనికులకు గుర్తుచేశాడు. అందుకే భారత సైన్యం కూడా పిల్లాడిని సత్కరించింది. శ్రావణ్ సింగ్ ధైర్యాన్ని, దేశభక్తిని భారత సైన్యం గుర్తించింది. ఈ చిట్టి వారియర్ని సత్కరించింది. తాజాగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో.. 7వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్.. మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్.. శ్రావణ్ సింగ్ను సత్కరించారు. అతడికి ఒక జ్ఞాపికను అందజేశారు….