*పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో టెన్షన్..టెన్షన్*
భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో భయాందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎల్పిజి వంటి నిత్యావసర వస్తువులు యుద్ధం కారణంగా తమకు లభిస్తాయో లేదోనన్న భయంతో వాటిని నిల్వ చేసుకోవడానికి ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద క్యూలో నిల్చుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించింది. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉందని, తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని వివరించింది. మీరు తగినంత ఇంధనం ఉంటుందో లేదోనని భయపడి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంధనం, LPG మా అన్ని అవుట్లెట్లలో సులభంగా అందుబాటులో ఉన్నాయని IOC ఒక X పోస్ట్లో పేర్కొంది. దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పెట్రోల్ పంపుల వద్ద అనవసరమైన రద్దీని నివారించాలని IOC సూచించింది. ప్రశాంతంగా ఉండటం, అనవసరమైన రద్దీని నివారించడం ద్వారా మీకు మెరుగ్గా సేవ చేయడంలో మాకు సహాయపడాలని సూచించింది.