సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్: ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం అలియాబాద్లో రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల్లో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం రైతుల వెన్నంటే నిలుస్తుందని తెలిపారు.
ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
Published On: November 12, 2025 4:18 pm